చిందులు తొక్కిన జేసీ దివాకర్ రెడ్డి.. షాకిచ్చిన డీఎస్పీ | Dsp Gave Strong Warning To Jc Diwakar Reddy

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సీ ఎస్టీ కేసులు తమపై పెడుతున్నారంటూ జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో ఆమరణ దీక్షకు ఈరోజు సిద్ధమయ్యారు. జేసీ బ్రదర్స్ పిలుపుతో టెన్షన్ వాతావరణం అక్కడ కనిపించింది.
సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరులు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తుగా జేసీ సోదరులను హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ దివాకర్ రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో.. ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు.
తనను నిర్బంధించడానికి వచ్చిన పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి దౌర్జన్యం చేసినట్టు సమాచారం. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించినట్టు తెలిసింది. జేసీ వ్యాఖ్యలపై డీఎస్పీ ఏ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. నోరు జాగ్రత్త అంటూ హెచ్చరించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దూషిస్తే ఊరుకోబోమని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇక తన ఇంట్లోకి పోలీసులు వస్తే ఎలా ఊరుకుంటానని దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ హక్కు ఉందని వారు వస్తారని ప్రశ్నించారు.
అయితే తాడిపత్రిలో ఉద్రిక్తతల దృష్ట్యా 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి సభలు సమావేశాలు ధర్నాలు నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన వీధుల్లో దుకాణాలను బంద్ చేయిస్తున్నారు. తాడిపత్రిలోకి ఎవరికీ రానీయడం లేదు.
Post a Comment